Wednesday, March 15, 2017

అరుదైన భక్తుడికి అశ్రు నివాళి సత్యసాయి భక్తులు, 'సనాతన సారధి' సంపాదకులు శ్రీ బి.వి.రమణరావు స్వామి లో ఐక్యమైనారు.

అరుదైన భక్తుడికి అశ్రు నివాళి
సత్యసాయి భక్తులు, 'సనాతన సారధి' సంపాదకులు శ్రీ బి.వి.రమణరావు స్వామి లో ఐక్యమైనారు. 

'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు' అంటారో కవి. ఒక భక్తుడు మరణిస్తే మరో భక్తుడు పుడతాడనే నమ్మకం లేని రోజులివి. సుమారు అయిదు దశాబ్దాలకు పైగా స్వామి సాన్నిహిత్యంలో, సన్నిధిలో గడిపిన ధన్యజీవి బి.వి.రమణరావు (91) మంగళవారం మరణించారు. హైదరాబాదులో బుధవారం ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. వందలాది స్నేహితులు, సత్యసాయి భక్తులు, సన్నిహితులు, బంధువులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఫార్మా రంగంలో ఆయన చిత్తశుద్ధి, నిజాయితీ, తీసుకొచ్చిన సంస్కరణలు ఎన్నో మన్ననలు పొందాయి.   

1926 అక్టోబర్ ఒకటిన తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో బి.వి.రమణరావు జన్మించారు.  1983లో ఆయన ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలర్ గా పదవీ విరమణ చేశారు. 1966లో తొలిసారి సత్యసాయి బాబా దర్శనం చేసుకున్న రమణరావు, ఆదర్శ సాయి సేవకుడిగా, జీవితాంతం స్వామి దివ్య మార్గదర్శనంలో సేవ చేసుకున్నారు.  

ఆనాటి నుండి స్వామి మార్గదర్శకత్వంలో నిరంతరంగా, నిరంతరాయంగా, అవిశ్రాంతంగా, దేశవ్యాప్తంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పని కూడా ఆయన శ్రద్ధగా ఎంతో పెద్ద ప్రణాళికలాగా  చేసేవారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన అందరినీ 'సర్' అని సంబోధించేవారు.    
  
శ్రీ సత్యసాయిబాబా ఆయనకు ఎన్నో గురుతరమైన బాధ్యతలు అప్పగించారు. అఖిల భారత సేవా దళ్ (సేవా దళం) సమన్వయకర్తగా, ఆంధ్ర ప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా రమణరావు శ్రీ సత్యసాయి బాబా మార్గదర్శకత్వంలో నర నారాయణ సేవా కార్యక్రమాలను సమన్వయకర్తగా సమర్ధవంతంగా నిర్వహించారు. 1977లో వచ్చిన కృష్ణా జిల్లా దివిసీమ తుఫాను సమయంలో ఆయన వేలాది బాధితులను రక్షించడంలో, అన్నపానాదులు అందించడంలో అనితరసాధ్యమైన సేవ చేశారు. 2001లో గుజరాత్ లో సంభవించిన భుజ్ భూకంపంలో 78 లారీల ఆహార పదార్ధాల సరఫరాను, సహాయ కార్యక్రమాలను సమన్వయకర్తగా ఎంతో నేర్పుగా నిర్వహించారు. ఆయన సమన్వయకర్తగా వ్యవహరించిన ఎన్నో బృహత్తర కార్యక్రమాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.  

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ రమణరావు కథకుడిగా  కూడా లబ్ధ ప్రతిష్ఠులు. ఆయన కథలు యువ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, వనిత, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక, తెలుగు స్వతంత్ర వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఆధ్యాత్మిక రచయితగా కూడా ఆయన ఎన్నో పుస్తకాలను రచించారు. ప్రేమబంధం, ప్రేమామృతం, ప్రత్యక్ష పరమాత్మ, దివ్య జ్ఞాన దీపికలు, భగవాన్ శ్రీ సత్యసాయివాణి గ్రంధాలను రచించారు. ఆంగ్లంలో కూడా Love is My Form, Nectar of Love, God as Guide and Goal, Beacons of Divine Wisdom  గ్రంధాలను రచించారు. సత్య సాయి సేవా సంస్థల పత్రిక 'సనాతన సారధి' తెలుగు పత్రికకు 2011 నుండి సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తుది శ్వాసవరకు నిబద్ధతతో, భక్తిప్రపత్తులతో సేవలందించారు.  

సత్యసాయి భక్త ప్రపంచం ఆయన మరణంతో ఒక సహృదయ భక్తుణ్ణి కోల్పోయింది. సత్య సాయి పవిత్ర కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు కోల్పోవడం సంస్థలకు తీరని లోటు. ఆయన సేవా భావం, స్వామి భక్తి తత్పరత, నిబద్ధత భావి భక్తులను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, తెల్లని వస్త్రాలతో సేవాదళ్ సభ్యులను, స్వఛ్చంద సేవకులను, భక్తులను ఆయన ఎంతగానో ఉత్సాహపరుస్తూ, నిరంతర స్ఫూర్తి నింపుతూ ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. 


శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ ఆర్.జె.రత్నాకర్రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్  భాస్కర్ఆంధ్ర ప్రదేశ్తెలంగాణా రాష్ట్రాల శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్.జి.చలంఆంధ్ర ప్రదేశ్తెలంగాణా రాష్ట్రాల శ్రీ సత్యసాయి వరల్డ్ ఫౌండేషన్ అధ్యక్షులుశ్రీ సత్య ట్రస్ట్ కన్వీనర్విశ్రాంత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్డి.జి.పి. శ్రీ హెచ్.జె.దొరహైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం.వి.ఆర్.శేషసాయిప్రముఖ సినీ నటులుకరుణామయుడు ఫేం శ్రీ విజయచందర్ప్రముఖ మానసిక వైద్య నిపుణులుమెజీషియన్ శ్రీ బి.వి.పట్టాభిరాం శ్రీ రమణరావుగారి మృతికి తీవ్ర సంతాపం తెలియచేశారు. ఆయన నిస్వార్ధ సేవకుప్రేమ తత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. 50 ఏళ్ళుగా వేలాది సేవాదళ్ కార్యకర్తలకు ఆయన ఇచ్చిన సునిశిత శిక్షణను వారు జ్ఞాపకం చేసుకుని ఘనంగా నివాళులర్పించారు.








   

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...