Tuesday, June 2, 2026

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.

 

Sadhana Camp.

 ఓం శ్రీ సాయిరామ్

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968)

ఆయా జిల్లాల  ప్రతినిధులతో చర్చల ఫలితంగా ,  మీ జిల్లా అధ్యక్షులు నాకు సమర్పించిన నివేదికలను, ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అందులో మీ ఆశలు, ఆశయాలతో కూడిన అంశాలు గమనించాను. ఆ ఆలోచనలన్నీ మీకు సంతోషాన్నిచ్చేవి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరంతా ప్రస్తుతం చేస్తున్న, భవిష్యత్తులో చెప్పట్టబోయే ఈ కార్యక్రమాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనసుని శుద్ధి చేయడం మాత్రమే.

మీ కందరికి తెలిసిన విషయమే, ధోబికి పలు రకాల బట్టలు ఇచ్చినప్పుడు వాటిలో  పాంట్లు,బుష్కోట్లు,తువ్వాలు,ధోతి వంటివి వున్నా,అతనికి ఇవ్వడంలో వున్న ప్రయోజనం, అతను చేసే పని ఒకటే కేవలం శుభ్రపరచడం. అలాగే మీరు ధ్యానం చేయమని ఉత్సాహపరిచినా, ప్రవచనం ఏర్పాటు చేసినా, భజనలు నిర్వహించినా, పేదవారికి బట్టలు పంచినా, పూజలు చేయించినా లక్ష్యం ఒక్కటే, అది అహంకారం,దురాశ,ద్వేషం,అసూయ,అత్యాశలతో కలుషితమైన  మనసుని శుద్ధి పరచడం. ప్రతిఒక్కరు అలవర్చుకోవల్సిన ఒకే ఒక గుణం పరస్పరం ప్రేమను పంచడం. అన్ని రూపాల దైవభక్తులలో, సాయి భక్తుని గుర్తింపు అది మాత్రమే. మనుషులు పుడుతుంటారు, మరణిస్తారు. నడుమ కాలంలో పెరుగుతారు, క్షీణిస్తారు. ఈ పరస్పర ప్రేమ పెరుగుదల గుర్తింపు సేవ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది. ధనవంతులకి, ఉన్నత పదవులలో వున్నవారికి సేవలు చేసేవారు చాలా మందే వుంటారు. కానీ మీరు సేవలు చేయవల్సింది, ఏ సేవలు పొందలేని నిరుపేదలకి, అభాగ్యులకి మాత్రమే. ఇతరులకి సేవలందించడం ద్వారా జీవితాన్ని గడుపుతున్న వారికి సేవలు చేయండి. వేల సంఖ్యలో సంస్థలు ఇటువంటి సేవలు చేస్తున్నప్పుడు, నా పేరు పైన ఒక సంస్థ వుండవలసిన ప్రత్యేక అవసరం ఏమిటి. అందరిలో నేనున్నానని గుర్తించాలి, పూజా భావనతో అందరినీ సేవించాలి.

 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.

సముద్రపు అలలపై ఒక ఎండుటాకుమీద ఒక చీమ ఒడ్డుకి చేరుకోవాలని తంటాలు పడుతోంది. దాని అవస్థ గమనించిన ఒక పావురం ఎగిరివెళ్ళి , చీమ వున్న ఆకుని తన ముక్కుతో పట్టి తెచ్చి నేల మీద పొడి ప్రదేశంలో వుంచింది. అనంతంగా నిండి వున్న దివ్యత్వం లో అణుమాత్రమైన  ఆ చీమ కూడా దైవ రూపమే. అడవిలో సముద్రంలో వున్న వికృతమైన జీవాలు కూడా పరమాత్మ దృష్టిలో అంతే ముఖ్యమైనవి . రక్షించడం కోసం నిన్ను ప్రేరేపించిన ప్రేమని, బాధని తొలగించడానికి నీలో పొంగిన దయని మాత్రమే భగవంతుడు చూస్తాడు. సేవని ఒక అధ్యాత్మిక సాధనగా సత్యసాయి సంస్థలు చేపట్టాలి. సభ్యులు నన్ను సర్వాంతర్యామిగా గుర్తించి సేవ ని పూజగా చేయాలి.

జిల్లా అధ్యక్షుడు, సమితి నిర్వాహకుడు సాధన తప్పనిసరిగా చేయాలి. భగవంతుని పై పూర్తి విశ్వాసం వుండాలి. వారి మాటలలో,ఆలోచనలలో మరియు చేతలలో ఆ విశ్వాసం కనిపించాలి. 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.సభ్యులను ఉత్సాహ పరిచే కార్యక్రమాలను అధ్యక్షులు చేపట్టాలి. సంస్థ అభివృద్ధి చెందాలంటే వారికి ఈ నామ రూపాలపై విశ్వాసం వుండితీరాలి.

ఒకసారి హనుమంతుని ద్వారకకి తీసుకుని రమ్మని గరుడుని పంపించాడు కృష్ణుడు. రాముని ఆజ్ఞ తప్ప ఆన్యులని లెక్క చేయని ఆంజనేయుడు గరుడుని తో రానని గొడవ పడతాడు. ఈ సారి కృష్ణుడు కాదు రాముడుని కలవడం కోసం రమ్మని గరుడుని మళ్ళీ పంపిస్తాడు కృష్ణుడు.

ఇతరులపై అధికారం చెలాయించాలని కోరుకోరాదు. వారికి ఉపయోగపడే అవకాశాలు అన్వేషించాలి. తను చేసే పనిలో నిర్లక్ష్యం వలన అధికారం లో వున్న వారి వల్ల తలనొప్పులు ఎదురవుతాయి. ఒక సేవకుడిలా వుండాలి, అది కూడా భగవంతుని సేవకునిలాగా వుండాలి. అప్పుడే  తగిన శక్తి, ఆనందం కూడా మీకు తోడవుతాయి. ఆయన చేతులలో ఒక ఉపకరణంగా భావించాలి , మీ మంచేదో ఆయనకే తెలుసు, ఆయనకి కావల్సిన రీతిలో మిమ్మల్ని మలచనివ్వండి .

 

 

కలవరం నుండి మానవుని రక్షించగలిగేది ఉపేక్ష మాత్రమే

ఆయా సమితులు పని చేయడం ప్రారంభించిన తరువాత ప్రారంభంలో వున్న స్నేహ పూర్వక పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం నేను గమనించాను. అభిప్రాయబేధాలు అధికమయ్యాయి, నిగ్రహం భయపడేలా అయింది. అపార్ధాలు , వర్గ వివక్షలు తలెత్తుతున్నాయి . కలిసివుండే మనుషులు విడిపోతున్నారు . తత్ , త్వం (అది,ఇది ) రెండూ ఒకటే, అది మర్చిపోవడం వల్ల దానికి దూరమవుతున్నారు . విషయ వాసనలకి దగ్గరైనప్పుడు ఆత్మ దూరమవుతుంది.  ఆత్మకి చేరువైనప్పుడు వాసనలు దూరమవుతాయి. మీరు భౌతిక విషయాలవైపు,ప్రపంచం వైపు దగ్గరవుతునప్పుడు అపేక్ష పెంచుకున్నట్టే, తద్వారా ఇష్టాయిష్టాల సంకెల లో బందీలవుతారు.

కీర్తి కోసం , సుఖాల కోసం అర్రులు చాచకుండా విముక్తులవండి. అంటే ఉపేక్ష పెంచుకోండి, స్వతంత్రులు కండి. ఉపేక్ష మాత్రమే కలవరం తొలగించి,పరమ సత్యాన్ని తెలియచేస్తుంది . మనిషి తనని తాను జంతువుగాను, భేతాలుడి  వలెనో మార్చుకొనరాదు . అతను దైవంగా మారాలి. దూరదృష్టితో ఒక శిలని శిల్పంగా మలచి వేణువు తో వున్నబహు సుందరమైన కృష్ణ రూపం మలచినట్టుగా, మనిషి కూడా విధి విసిరే తాకిడులని  శిల్పకారుడి ఉలి పోటుగా మార్చుకోవాలి.

మీరు ప్రతిపాదించిన అంశాల ఆధారంగా నా అంగీకారం కోసం పంపిన నివేదికలను పరిశీలించాను. నిధుల సమీకరణ కోసం మీరు చేసిన సూచనలు పూర్తి చెడుగా వున్నాయి. ఈ విషయంలో మీరంతా ఏక కంఠంతో చేసిన ప్రతిపాదన నాకు ఏ మాత్రం తృప్తిగా లేదు. ప్రాధమికంగా ధనం అంటే రజో గుణ సంబంధమై ప్రమాదాలు, హాని తలపెట్టే లక్షణం కలిగినది.

భవిష్యత్తు కోసము తేనెటీగలు తేనే సేకరించినట్టు , మానవుడు ధనమును కూడబెట్టుచున్నాడు. కానీ పొగ పెట్టి తేనెటీగలను తరిమి కొట్టి తేనే దొంగిలించబడుతోంది.  ధనం వసూలు చేసి నిల్వ చేయాలన్న మీ ఆలోచన నాకు అంగీకారం కాదు . నిధుల కోసం,దానాల కోసం మీరంతా తిరుగుతాననడం నాకు నచ్చలేదు .

 

 

ఖరీదైన వస్తువులు నిరుపయోగమైన ఆటంకాలు

మీరు గనుక సత్సంకల్పాలతో నిజాయితీగా ప్రార్ధన చేస్తే నిధులు వాటంతటవే వస్తాయని నేను అభయమిస్తున్నాను.  విశ్వాసంతో చూస్తూ వుండండి. నిధులు అవే ప్రవహిస్తాయి. పూర్వకాలంలో నిధుల ప్రస్తావన లేకుండా కేవలం విశ్వాసంతో, నిజాయితీ లతో మహర్షులు ఎన్నెన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించారు. ఇప్పుడు మీరంతా గర్వంతో, ఆందోళనతో, నమ్మకం లేకుండా తిరుగుతున్నారు . ఒక పెట్టికి చిన్న కన్నం పెట్టి, దాని ద్వారా సభ్యులు రహస్యంగా వేయాలి అని నేను  చేసిన సూచనని  మీరెవరు పాటించడం లేదని తెలుస్తోంది.

అదియే కాదు, మన సంస్థ కార్యక్రమాలకి అవసరమైన చాలా వస్తువులకి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. భజన, నగర సంకీర్తనలకి హృదయంలో తీవ్రమైన కాంక్ష మరియు  నాలుక పై నామం వుంటే చాలు. బృందావనం లో గోపికలు ఉదయం పూట వెన్న కోసం చల్ల కుండలు చిలుకుతూ హరినామ కీర్తన చేసేవారు . ఆ సమయంలోనే  వారి చేతులకున్న గాజుల గలగలలు, కుండలోపల కవ్వం తిరుగుతున్నప్పుడు చేసే చప్పుడులు నామ సంకీర్తనకి నేపధ్యసంగీతంలా మారి చల్లని చిరుగాలిలో చేరి ఇరుగుపొరుగు వారికి వీనులవిందు చేసేది. మందిని ప్రోగుచేసి, ఖరీదైన వస్తువులు కొనవలసిన అవసరం లేదు. నిజానికవి మీ సాధనకి ఏ మాత్రం ఉపయోగం లేకపోగా, ఆటంకాలు కలిగిస్తాయి.

ఉపన్యాసాల కోసం, వక్తల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టకండి. పురస్కారాలు, ఆర్భాటంగా చేసే స్వాగతాల వంటివి ఆమడ దూరం పెట్టండి. ఒక కుర్చీ, ఒక బల్ల చాలు.. చాలావరకు మీ సమావేశాలకోసం లౌడ్ స్పీకర్ల వంటివి కూడా విలాసవంతమే. అటువంటివన్నీ కూడా అవసరాల కన్నా గొప్పలు చూపించడానికి అన్నట్టుగా వుంటాయి. మీ చుట్టూరా వున్న ఇతర సంస్థల వారికి, నిధుల వినియోగంలో తీసుకునే జాగ్రత్తలు, వృధా ఖర్చులని తొలగించే విషయాలలో మీరొక ఉదాహరణగా నిలవాలి . మీ శక్తి మేరకే జనులను ఆహ్వానిచండి. తప్పనిసరి అనుకుంటూ సంఖ్య పెంచుతూపోకండి. ఎంతో మందిలో మనము అన్న భావన తో కాక వారే ఎదురు చూసే రీతిగా చేసుకోండి.

సమితి పనులలో ధనానికి అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి  

హంగులు ఆర్భాటాలు లేకుండా పదిహేను లేక ఇరవై మందో కలిసి ఒక సమితి లేక సంఘంగా ఏర్పడి కార్యక్రమాలకి అవసరమైన ధనము సమకూర్చుకోవచ్చు. ధనవంతుడైన వ్యక్తి వలన ధనము పొందవచ్చుననే ఆలోచనతో అతనిని సభ్యునిగా చేర్చుకోరాదు. అణాల కన్నా గుణాలు మిన్న. నేను ఏదైనా పల్లెకి వెళ్లినప్పుడు తప్ప , అక్కడ ఏ ప్రత్యేక వేడుకలు నిర్వహించనవసరం లేదు.

పెద్ద పెద్ద సభల నిర్వహణ కోసం రకరకాల మార్గాల ద్వారా భారీగా నిధులు ప్రోగుచేసి, వాటిని దుర్వినియోగపరిచే వారిని నీవు విమర్శించవచ్చు. కనుక అటువంటి తప్పులు నీవు చేయకుండా నివారించాలి. నీ ఆత్మగౌరవాన్ని నీవు మరింత ఉన్నంతంగా పెంపొందించుకోవాలి..అది నీ ప్రత్యేకత కావాలి. నీకొక  మాస్టర్(స్వామివారే) వున్నాడు, ఆయన ఎవరిని యాచించడు, ఎవరి దగ్గర ఏమి తీసుకోడు. తనని అడిగే వారికి మాత్రం పుష్కలంగా అడిగినవన్నీ ఇస్తాడు. ప్రేమ అనే కానుకతో వింత ప్రదేశాలలో, వింత మనుషుల కోసం నేను తిరుగుతుంటాను . ఉపేక్ష నా బలం. మనిషికి మనిషికి నడుమ ఏ వ్యత్యాసం నేను చూపించను. అందువలన అందరూ నన్ను సమానంగా ప్రేమిస్తారు. అన్ని రకాల అపార్ధాలకి, విభజనలకి మూలం డబ్బు మాత్రమే. దానిని మరుగునే వుంచండి, అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి. ప్రేమ, వినయం,నిర్లిప్తత మరియు సేవ మాత్రమే మీ నిధులు గా భావించండి.

కంటికి కాలికి ఏదో కనిపించని ప్రేమ బంధం వుంది. దారిలో నడుస్తున్నప్పుడు కన్ను ముల్లుని చూసినప్పుడు, కాలు పక్కకి జరుగుతుంది. అందువలన దేహసంక్షేమం రక్షింపబడుతుంది. అదే విధంగా జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు రెండు కళ్ల వలె మెలిగి దారిలో ముళ్లని గమనించి పాదాలని రక్షించుకోవాలి.

నా ఉద్దేశ్యంలో ప్రపంచ సమావేశాలు మూడు సంవత్సరాలకి ఒకసారి జరిగితే చాలు. అఖిల భారత సమావేశం సంస్థ యొక్క హృదయం ప్రశాంతి నిలయంలో జరగడమే చాలా మంచిది.

*****

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.

  Sadhana Camp.   ఓం శ్రీ సాయిరామ్ సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం , నవంబర్ 21 ,1968) ఆయా జిల్లాల  ప్రతి...